తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నాటి నుండి ఏదొక రూపంలో ఆమె ఆత్మ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఓ సారి చెన్నై మెరీనా బీచ్ లో హల్చల్ చేసిందంటూ ఫోటోలు సందడి చేయగా, మరొకసారి అపోలో హాస్పిటల్ ఆవరణలో తిరుగుతోందంటూ వీడియోలు సందడి చేసాయి. ఇక, రాజకీయ కోణంలో పన్నీర్ సెల్వం, శశికళలకు కలలో కనిపించిన “ఆత్మల కధలు” ఎలాగూ ఉండగానే ఉండనున్నాయ్!

ఇలా జయలలిత ఆత్మ ఎప్పుడూ ఎవరో ఒకరిని పలకరిస్తూ ఉండగా, తాజాగా ఆ వంతు ఓ సాధువుకు వచ్చింది. తిరువరూరుకి చెందిన శ్రీ మహారిషి అనే ఓ సాధువు “జ‌య‌ల‌లిత ఆత్మ త‌న‌తో మాట్లాడి ప‌లు విష‌యాలు చెప్పింద‌ని” మీడియాకు తెలిపి సంచలనం సృష్టించాడు. మంగళవారం నాడు పన్నీర్‌ సెల్వం ఇంటికి వెళ్లిన సందర్భంగా సదరు సాధువు ఈ వ్యాఖ్యలు చేసి తమిళనాట అల‌జ‌డి రేపాడు.

త‌న‌ను ఆసుప‌త్రిలో 75 రోజుల పాటు ఉంచారని జ‌య‌ల‌లిత ఆత్మ‌ చెప్పిందని, పన్నీర్‌ సెల్వం, దీప కలిసి ఏఐఏడీఎంకేను రక్షించాలని చెప్పమని తనను అమ్మ ఆత్మ ఆదేశించిందని తెలిపారు. పన్నీర్‌ సెల్వానికే అమ్మ మద్దతు తెలిపారని ఆ సాధువు చెప్పడంతో, ప‌న్నీర్‌ సెల్వం ఇంటి ముందు కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా, అమ్మ ఆత్మ మాత్రం తమిళనాట బాగానే సందడి చేస్తోందని ప్రజలు చెప్పుకుంటున్నారు.