అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న పురుచ్చతలైవి అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స చేసేందుకు ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్య నిపుణులు చెన్నై చేరుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ నాయక్, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అంజన్ తో లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలే కలవనున్నారు. మూడు రోజుల క్రితం పలు సూచనలు చేసి లండన్ వెళ్లిపోయిన బీలే, మరోసారి ఆమె ఆరోగ్య పరిస్థితి పరీక్షించేందుకు నేడు చెన్నై రానున్నారు.
ప్రస్తుతానికి జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, మరో రెండు వారాల చికత్స అనంతరం ఆమెను ఇంటికి పంపిస్తారని తెలుస్తోంది. ఆమె ఊపిరితిత్తులకు సోకిన ‘ఫంగల్ ఇన్ఫెక్షన్’ తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. అయితే ఆమె వద్దకు అతికొద్ది మందికి మాత్రమే అనుమతి లభిస్తోందని, ఆమె మిత్రురాలు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, శశికళ తమ్ముడు ఎంగిర దివాకరన్ లు జయలలిత బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. కాగా, యాంటీ బయోటిక్స్ వాడుతున్న జయలలిత భారీ ఎత్తున బరువు తగ్గే అవకాశం ఉందని, డిశ్చార్జ్ అనంతరం రెండు నెలలు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది.