ఆగష్టు 11వ తేదీన విడుదల కాబోతున్న మూడు ప్రతిష్టాత్మక సినిమాలలో బోయపాటి శ్రీను “జయ జానకి నాయక” ఒకటి. అందరి కంటే ప్రమోషన్స్ లో “నేనే రాజు నేనే మంత్రి” ముందు వరుసలో ఉండగా, నితిన్ ‘లై’ కూడా ఇప్పటికే ఓ టీజర్ ను, రెండు పాటలను విడుదల చేసి సమరానికి ‘సై’ అంటున్నాడు. తాజాగా బోయపాటి కూడా తన దూకుడును పెంచి, ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసారు. ఇప్పటికే రెండు టీజర్లను విడుదల చేసిన చిత్ర యూనిట్, మొదటి పాటగా దేవిశ్రీ మెలోడీని దించారు.
‘నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే’ అంటూ శ్వేత మీనన్ ఆలపించిన ఈ పాట పక్కా దేవిశ్రీ మార్క్ మెలోడీగా చెప్పవచ్చు. చంద్రబోస్ అందించిన సింపుల్ సాహిత్యం అన్ని వర్గాలకు చేరువయ్యే విధంగా ఉండగా, బ్యాక్ గ్రౌండ్ డ్రమ్స్ మ్యూజిక్ మరియు వయోలిన్ సౌండ్స్ తో దేవిశ్రీ కట్టిపడేసాడు. అయితే ఇలాంటి పాటలను అందించడంలో సిద్ధహస్తుడిగా పేరుగాంచిన దేవిశ్రీ, కొత్తదనాన్ని అందించడంలో విఫలమయ్యాడేమో గానీ, మెలోడీ ప్రియులను సంతృప్తి పరిచినట్లే చెప్పవచ్చు.