తెలుగు సినిమా గమనం మారుతోంది. మునుపటితో పోల్చుకుంటే… నవతరం దర్శకుల పుణ్యమా అంటూ తెలుగులోనూ కొత్త కొత్త కధలు వెండితెర రూపం సంతరించుకుంటున్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను పంచుతున్న ఈ తరుణంలో… ప్రధానంగా తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ కొనసాగుతోంది. అదే ఒక సినిమా… రెండు కధలు..! అవును… ఫస్టాఫ్ వరకు ఒక కధ చెప్పడం… ఆ తర్వాత ఫస్టాఫ్ తో సంబంధం లేకుండా మరో కధను కొనసాగించడమే ప్రస్తుత ‘ట్రెండ్’గా మారింది.
తాజాగా విడుదలైన ‘జనతా గ్యారేజ్’ కూడా ఓ విధంగా ఇలాగే కొనసాగింది. ఫస్టాఫ్ వరకు ‘ప్రకృతిపై ప్రేమ’ అంటూ కొనసాగిన హీరో క్యారెక్టర్ లో ఒక్కసారిగా మార్పు వచ్చి, ‘మనుషులపై ప్రేమ’ పుట్టుకొస్తుంది. అండర్ లైన్ గా సెకండాఫ్ లో ఓ మూడు సన్నివేశాలలో ప్రకృతి గురించి చెప్పినా, అవి తెరపై పండలేదు. రెండున్నర్ర గంటలలో ఓ కధను చూపించడానికి దర్శకులకు ఆలోచనలు రావడం లేదో ఏమో గానీ, ఈ కాన్సెప్ట్ మాత్రం ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదు.
నిజానికి అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సినిమాకు కూడా ఇవే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫస్టాఫ్ లో హీరో విలన్ ను మట్టికరిపించడం, సెకండాఫ్ లో అమ్మ సెంటిమెంట్… ఇలా రెండు కధలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు కితాబిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై, భారీ డిజాస్టర్లుగా మిగిలిన ‘సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం’ సినిమాలు ఇదే కాన్సెప్ట్ ‘ఒక సినిమా… రెండు కధల…’ కాన్సెప్ట్ తో తెరకెక్కినవే.