ఆగష్టు 12వ తేదీన విడుదల కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివల “జనతా గ్యారేజ్” సినిమాను కొన్ని అనివార్య కారణాలతో సెప్టెంబర్ 2వ తేదీకి ఈ సినిమాను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా చెప్పిన తేదీకి ఫిక్స్ అయిన అభిమానులను నిరాశపరచడం ఇష్టంలేని చిత్ర బృందం, అదే తేదీకి ‘జనతా గ్యారేజ్’ ఆడియో విడుదల చేయాలని సంకల్పించడం అభిమానులను ఉత్సాహంలోకి నెట్టేస్తోంది.
దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాటలలో ఒక పాట ఇప్పటికే ఇంటర్నెట్ లో లీకై, జూనియర్ అభిమానులను, సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ట్రేడ్ వర్గాల టాక్ మేరకు కూడా ఈ సినిమా ఆడియో బాగా వచ్చిందన్న టాక్ ఉంది. దీంతో దేవిశ్రీ – కొరటాల, దేవిశ్రీ – జూనియర్ ల కాంభినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని అభిమాన గణం భావిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఒక టీజర్, వీక్షకుల నుండి విశేషమైన స్పందన తెచ్చుకుని గత యూ ట్యూబ్ రికార్డులను బద్ధలు కొట్టగా, ఈ టీజర్లో దేవిశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండడంతో, దేవి మ్యూజిక్ పై అంచనాలు పెరిగాయి. దీంతో ఆగష్టు 12న విడుదల అవుతోన్న ఆడియోతో పాటు, ధియేటిరికల్ ట్రైలర్ కోసం ‘బుడ్డోడు’ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
అధికారికంగా ఇంకా డిక్లేర్ చేయకపోయినప్పటికీ, శిల్పకళావేదికలో ఈ సినిమా ఆడియో వేడుక జరగనున్నట్లు సమాచారం. అయోధ్య మీడియా ఆధ్వర్యంలో ఈ వేడుకను కన్నుల పండుగగా రూపుదిద్దుకోబోతోందని తెలుస్తోంది. అయితే ఆడియో విడుదల తేదీని ఖరారు చేస్తూ… ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావడం ఒక్కటే తరువాయి..!