Janasena young cadre vizagఏపీకి ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ‘జనసేన’ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఏపీకి ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లతో ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జల దీక్ష పేరిట, సముద్రంలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ‘హోదా’ నినాదాలు చేస్తూ వినూత్న నిరసనకు దిగారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార బీజేపీపై ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన గురుతర బాధ్యతను బీజేపీ విస్మరిస్తోందని, ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే గడచిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని ఈ సందర్భంగా కార్యకర్తలు చెప్పుకొచ్చారు.

ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీల జెండాలు పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అయినా, ఎంపీలు పోరాడాలని పేర్కొన్నారు. అయితే ‘జనసేన’ అధినేతగా పవన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా… పార్టీ జెండాలు పట్టుకుని యువతరం మాత్రం నిరసన ప్రదర్శనలకు దిగుతోంది.