దుబ్బాక ఎన్నికలలో గెలిచి తెలంగాణ బీజేపీ తన సత్తా చాటింది. త్వరలో జరగబోయే తిరుపతి బై-ఎలక్షన్ లో గెలిచి తాము ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎదుగుతున్నాం అని చెప్పుకోవాలని ఆరాటపడుతుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ. అయితే బీజేపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో పొత్తులో ఉంది. రెండు పార్టీలు తిరుపతిలో పోటీ చెయ్యాలని భావిస్తున్నాయి.
జనసేనతో ఈ విషయంపై సంప్రదించకుండా తాము తిరుపతిలో పోటీ చేస్తున్నట్టు, దుబ్బాక మాదిరిగా గెలుస్తున్నట్టు కూడా ప్రకటించేసింది బీజేపీ. 2019 ఎన్నికలలో పొత్తులో భాగంగా ఈ సీటుని బీఎస్పీకి వదిలిపెట్టింది జనసేన. ఈ పాయింట్ మీద ఈ సీటు తమకు వదిలిపెట్టాలని బీజేపీ కోరుకుంటుంది.
అయితే 2019 ఎన్నికల ఓటమి తరువాత జనసేనని సీరియస్ గా తీసుకోవడం లేదని, ఈ సీటు నుండి పోటీ చేసి సత్తా చాటాలని జనసేన ఆరాటపడుతుంది. ఈ సీటులో జనసేనాని సామజిక వర్గ ఓటర్లు ఎక్కువ. అలాగే 2009లో ఇక్కడ నుండి చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. దానితో తమ సత్తా చాటడానికి ఇదే మంచి తరుణమని జనసేన అనుకుంటుంది.
ఈ సీటు ని బీజేపీకి వదిలిపెడితే చాలా తప్పుడు సంకేతం వెళ్తుందని ఆ పార్టీ భావిస్తుంది. ఈ తరుణంలో ఏం జరగబోతుందో చూడాలి. పైగా బీజేపీ ఈ సీటు నుండి పోటీ చేసి కనీసం పోటీని ఇచ్చే పరిస్థితి కూడా లేదని జనసేన భావిస్తుంది. “ఆ పార్టీకి కనీసం కాండిడేట్ కూడా లేడు. 2019లో బీఎస్పీకి ఇస్తే ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది,” అని జనసేన లీడర్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ ఎన్నికలో బీఎస్పీకి డిపాజిట్ కూడా దక్కలేదు.