ఈ నెల 15న తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం వంతెనపై నిర్వహించే కవాతుతో జనసేన సత్తా దేశవ్యాప్తం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికోసం పార్టీ నేతలు, అభిమానులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సమాయత్తం అవుతున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ప్రకటనపై ఇతర పార్టీ కార్యకర్తలే కాకుండా సొంత పార్టీకి చెందిన తెలంగాణ కార్యకర్తలు కూడా పెదవి విరుస్తున్నారు. పక్కనే ఉన్న సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే కనీసం గుప్పెడు సీట్లలో పోటీ చెయ్యలేని పార్టీ సత్తా దేశవ్యాప్తం ఎలా చేస్తారని వారంతా ప్రశ్నిస్తున్నారు.
చిన్నా చితకా పార్టీలు కూడా ఎన్నికలలో పోటీ చేస్తుంటే అశేష అభిమాన ఫాలోయింగ్ ఉండి కూడా పోటీకి వెనుకాడటం ఏంటో అని ఆ పార్టీ తెలంగాణ అభిమానులు వాపోతున్నారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన కొత్తలో జనసేన కొంత హడావిడి చేసిన ఆ తరువాత మిన్నకుండిపోయింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు.