జనసేన ఒకప్పటి అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ కాసేపటి క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒకప్పుడు మీడియాలో జనసేన పార్టీ గొంతు మాదిరి ఉండే వారు శ్రీధర్ గత ఎన్నికలలో ఆయన రాజమండ్రి రురల్ టిక్కెట్ ఆశించారు.
అయితే మొదటి నుండీ పార్టీలో పని చేసిన ఆయనను కాదని కందుల దుర్గేష్ కు ఆ సీటు కేటాయించడంతో మనస్థాపానికి గురయ్యారు. అయితే ఎన్నికల సమయంలో మాట్లాడకుండా ఫలితాలు వచ్చిన తరువాత రాజీనామా చేశారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలలోకి వచ్చిన శ్రీధర్ ఆ తరువాత బీజేపీలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
అనంతరం జనసేనలో చేరి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ లోకి తేలారు. జనసేనలో ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. ఆయనను అధికారపార్టీ తన మీడియా అధికారప్రతినిధిగా నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
జనసేనలో ఆ తప్పు జరుగుతుంది ఈ తప్పు జరుగుతుంది అంటూ ఇన్నాళ్లు ట్విట్టర్ లో ఎత్తిచూపుతూ వస్తున్న శ్రీధర్ మళ్ళీ రాజకీయాలలోకి వచ్చారు. ఇది ఇలా ఉండగా జనసేన పార్టీ సరైన ద్వితీయ శ్రేణి నాయకులు లేక ఇబ్బంది పడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే తప్ప పార్టీ వాణి ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లలేని పరిస్థితి.