జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తనువు జనసేనలో ఉన్నా మనసు మాత్రం ఎప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం ఎమ్మెల్యే మాట్లాడుతున్నారో లేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారో కూడా అర్ధం కాకుండా ఉంటుంది.
తాజాగా ఆయన పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఆయన అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాలసీని పొగిడేశారు. ఆ మర్నాడు తన జిల్లాలోనే జరిగిన జనసేన పవన్ కళ్యాణ్ దీక్షకు కూడా వెళ్ళలేదు. దీనితో ఆయనకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే అవి నిజం కాదని కొట్టి పడేసింది పార్టీ.
ఇది ఇలా ఉండగా రాపాక ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు అంటూనే వైఎస్సార్ కాంగ్రెస్ ని పొగిడేశారు. పైగా ఇంగ్లీష్ మీడియం పై మరోసారి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడారు. పార్టీ విధానాలు, స్థానిక ఎన్నికల సన్నద్ధత, గ్రౌండ్ లెవెల్ లో పార్టీకి నాయకత్వ లేమీ వంటి విషయంలో రాపాక ఆనందంగా లేనట్టుగానే కనిపించింది.
మీడియాలో వస్తున్నట్టుగా నాదెండ్ల మనోహర్ తో ఇబ్బంది ఉన్నట్టుగానే రాపాక మాటల్లో స్పష్టం అయ్యింది. ఆయన మాటలను బట్టి పార్టీకి ఆయనకు విబేధాలు ఉన్నట్టు స్పష్టం అవుతుంది. అలాగే మారాను అంటున్నా నమ్మడం కష్టంగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అనేది చూడాలి.