దుబ్బాకలో జరిగిన ఉపఎన్నిక పోరులో బీజేపీ సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి చెమటలు పట్టించింది. ఈ స్టోరీ రాసేటప్పటికి బీజేపీ విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. ఈ విజయంతో కమలనాథుల ఆనందానికి అడ్డు అదుపూ లేకుండా పోయింది.
ఇదే స్పూర్తితో పని చేసి 2023-24లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తాము విజయం సాధించడం ఖాయం అని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పార్టీ అభిమానుల సందడి కనిపిస్తుంది. అయితే వారితో పాటు జనసేన హడావిడి కూడా కనిపించడం విశేషం.
జనసేన పార్టీ అభిమానులు ఇది బీజేపీ… జనసేన కూటమి విజయం అని అభివర్ణిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అటువంటిది ఏమీ జరగలేదు. ఈ ఎన్నికలలో జనసేన బీజేపీకి మద్దతు కూడా ఇవ్వలేదు.
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా ఎక్కడా జనసేన జండా కూడా కనిపించలేదు. అయినా జనసేనలోని కొందరు అభిమానులు అత్యుత్సాహంతో క్రెడిట్ తీసుకోవాలని చూడటం విశేషం. దీనివల్ల జనసేనకు క్రెడిట్ రాకపోగా… అనవసరంగా పార్టీ నలుగురిలో అభాసుపాలు అవుతుంది. అయితే త్వరలో జరగబోయే జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ, జనసేనలు కలిసి పని చేస్తాయని సమాచారం.