సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రేపు తన కొత్త రాజకీయ పార్టీ జెండా అజెండా ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ పార్టీ వల్ల ఎవరికీ నష్టం ఎవరికీ లాభం అనేదాని పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తమకు లాభం అంటే తమకు లాభం అంటూ లెక్కలు వేస్తున్నాయి. అయితే జనసైనికులు మాత్రం కొత్తగా వస్తున్న ఈ పార్టీపై కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీని విడిచి ప్రత్యేకంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. కాపు ఓటు బ్యాంకు తన నుండి పోతుందేమోనని చంద్రబాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణని తెర మీదకు తెచ్చారని వారు ఆరోపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనతో కొత్త పార్టీ పెట్టిస్తున్నట్లు వారి అనుమానం. ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
నిజాయితీగల అధికారిగా గానీ కాపు సామాజిక వర్గం వ్యక్తిగా ఎవరికీ తెలీదు. తమ అనుమానాలతో వారే ఆయన కాపు కులస్తుడిగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ‘జేడీ’గా సుప్రసిద్ధుడైన ఆయన తన పార్టీ పేరు కూడా… అలాగే స్ఫురించేలా ‘జన ధ్వని’ (జేడీ) అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉందని కొందరు అంటున్నారు. అయితే చివరి నిముషంలో పెట్టే ఈ పార్టీ వల్ల లక్ష్మీనారాయణకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.