శనివారం ఉదయం విశాఖ గర్జన సభ కోసం ఇతర జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, వైసీపీ నేతలు సభలో బాగానే గర్జించారు. విశాఖనగరం కోసం వారు కార్చిన కన్నీళ్ళతో రామకృష్ణా బీచ్ సముద్రమట్టం ఒక అంగుళం పెరిగి ఉండవచ్చు కూడా. అయితే తరచూ దేవుడి స్క్రిప్ట్ అంటూ మాట్లాడే వైసీపీ నేతలకు అది ఎలా ఉంటుందో శనివారం మధ్యాహ్నమే కళ్ళారా చూసే భాగ్యం కలిగింది.
వారు గర్జించి గర్జించి అలిసిపోయి, తమతమ ఊర్లకు తిరిగి వెళ్ళేందుకు వైజాగ్ విమానాశ్రయానికి చేరుకొన్నప్పుడు అక్కడ జనసేన కార్యకర్తలున్నారు! వారు తమ అధినేత పవన్ కళ్యాణ్కు ఘనంగా స్వాగతం పలకడానికి అక్కడికి వచ్చి ఎదురుచూస్తున్నారు.
వైసీపీ మంత్రులు ఆర్కె. రోజా, జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంద్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తమ కార్లలో అక్కడికి చేరుకొన్నప్పుడు వారిని చూడగానే జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో వారిపై విరుచుకుపడ్డారు. ఎందుకో అందరికీ తెలుసు. వైసీపీ నేతలందరూ ముఖ్యంగా… మంత్రి ఆర్కె. రోజా నిత్యం వారి అధినేత పవన్ కళ్యాణ్ను నానామాటలు అంటూ దత్తపుత్రుడని ఎద్దేవా చేస్తుంటారు కనుక! జనసేన కార్యకర్తలు వారిని చూడగానే ఆగ్రహంతో చెప్పులు, రాళ్ళు విసిరారు. వారికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేస్తూ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన పోలీసులు వెంటనే వారిని చెదరగొట్టి వైసీపీ నేతలను భద్రంగా విమానాశ్రయంలోకి తీసుకుపోయారు. జనసేన కార్యకర్తల దాడిలో మంత్రి రోజా సిబ్బందిలో ఒకరి తలకు స్వల్పగాయం కాగా, వైవీ సుబ్బారెడ్డి కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఎప్పుడూ ఎదుటవారి మీద విరుచుకుపడే వైసీపీ నేతలకు జనసైనికుల ఆగ్రహం చవిచూడవలసి వచ్చింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే కదా?