మరికొద్ది గంటల్లో కాకినాడ వేదికగా ప్రసంగించనున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ వైపుకే అందరి చూపులు! సహజంగా మీడియా వర్గాలు ఇలాంటి సభలపై ఆసక్తి ప్రదర్శించడం పరిపాటే. అయితే మీడియా వర్గాలకు మించిన విధంగా సామాన్య ప్రజానీకం పవన్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఒక విధంగా పవన్ ‘ప్రత్యేక హోదా’పై తీసుకునే స్టాండ్ ఆధారంగానే రాష్ట్ర భవిష్యత్తు రాజకీయం మరో మలుపు తీసుకోనుందని రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు.
అయితే తాజా కధనాలను పరిశీలిస్తే… ‘జనసేన’ అధినేత ఒక సంచలనాత్మకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కు అనుకూలంగా కాకినాడలోని మైదానానికి చేరుకుంటున్న అభిమానులు, సామాన్య ప్రజలు అందరూ కూడా ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని పలుకుతూ రావడం గమనించదగ్గ విషయం. మరి ఈ నినాదాల వెనుక పవన్ దిశానిర్దేశం ఉందో లేదో ఇప్పుడే చెప్పలేం గానీ, వీరంతా ‘ప్రత్యేక హోదా’కు అనుకూలంగా నినాదాలు చేస్తుండడంతో, పవన్ కూడా ఇదే స్టాండ్ తీసుకుంటారని కధనాలు ప్రసారమవుతున్నాయి.
అదే జరిగితే… రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం మొదలైనట్లుగా భావించవచ్చు. అలాగే ‘ప్రత్యేక హోదా’ ఉద్యమం అసలు రూపం సంతరించుకునే అవకాశం లేకపోలేదు. నాణానికి మరో వైపు ఉన్నట్లు… ఒకవేళ పవన్ ప్యాకేజ్ కు సమ్మతం తెలిపితే, ‘ప్రత్యేక హోదా’ అన్న పేరు కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ప్రాధాన్యత వలనే అందరూ పవన్ ప్రసంగంలో ఏముంటుందోనని వేచిచూస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభ దాదాపుగా రెండు, మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది.