జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసారు. ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటానని అనడం విశేషం. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు.
నిన్న తొలిసారిగా చంద్రబాబు బీజేపీపై నిరసన వ్యాఖ్యలు చెయ్యడం, వెంటనే పవన్ కళ్యాణ్ పొత్తు పలుకులు పలకడంతో ఆ దిశగా ఊహాగానాలు మొదలయ్యాయి. టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకుని జనసేనతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోతుంది అని విశ్లేషకుల అంచనా.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలను కలుస్తున్నారా అని అనుమానం రాకమానదు. శనివారం నాడు ఆయన అనంతపురం టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో భేటీ కాగా, ఆదివారం నాడు ఆయన మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద అల్పాహార విందు స్వీకరించారు. అలా జరిగితే బీజేపీ వైకాపా కలిసి పోటీ చెయ్యొచ్చు.
దానితో రాష్ట్ర రాజకీయాలు రంజుగా మారబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీపై ఎదురు దాడి చేస్తే కమలం పార్టీ, వారితో కలిస్తే వైకాపాకు కూడా ఊపిరి సలపదు. ఈ ఊహాగానాల మధ్య ప్రతిపక్షానికి నిద్రలేని రాత్రుళ్లు ఉంటాయంటే అతిశయోక్తి కాదు.