ఏ ఒక్క రాష్ట్రానికి కొత్తగా ‘ప్రత్యేక హోదా’ను ప్రకటించరాదని 14వ ఆర్థిక సంఘం నిబంధన పెట్టిందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వాదనలో పస లేదని తేలిపోయింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఢిల్లీలో సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్రం చెబుతున్న విషయంలో తనకున్న అనుమానాలను నివృత్తి చేయాలని జైరాం… ఆర్థిక సంఘానికి ఇటీవల ఓ లేఖ రాశారట.
సదరు లేఖకు ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ఈ-మెయిల్ ద్వారా సమాధానం పంపారు. సేన్ పంపిన సమాధానాన్ని జైరాం మీడియాకు విడుదల చేశారు. సదరు లేఖలో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వరాదన్న నిబంధన ఎక్కడా లేదని జైరాం చెప్పారు. అనుకోని విధంగా ఇచ్చిన ఈ ‘ట్విస్ట్’తో బిజెపి వర్గాలు మళ్ళీ సరికొత్త కారణాలను వెలికితీస్తారేమోనని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. సదరు లేఖ సారాంశం పరిశీలిస్తే…
“ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు. కేంద్ర పన్నుల్లో వాటాలు పంచేటప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల మధ్య భేదం చూపే సంప్రదాయాన్ని కొనసాగించరాదని మాత్రమే సంఘం నిర్ణయించింది. ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల విషయంలో వేర్వేరు కేటాయింపులు కొనసాగించేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఉందని” ఆ లేఖలో సేన్ తెలపడంతో బిజెపి గుట్టు రట్టయ్యింది.