Jai Lava Kusa Vs Paisa Vasoolదసరా బరిలో నిలిచే సినిమాలలో ఒక సినిమాపై స్పష్టత వచ్చేసింది. గత ఆరు నెలలుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మురుగదాస్ – ప్రిన్స్ మహేష్ బాబుల “స్పైడర్” సినిమా విడుదల తేదీని సెప్టెంబర్ 27వ తేదీగా ఖరారు చేయడంతో ఈ ప్రభావం ఇతర సినిమాలపై ఖచ్చితంగా పడబోతోంది. ఒక వారం ముందుగా జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమా, అలాగే రెండు రోజుల తర్వాత బాలకృష్ణ “పైసా వసూల్” చిత్రాలు బరిలో ఉన్న విషయం తెలిసిందే.

అంటే దసరా బరిలో మూడు పెద్ద సినిమాలు నిలవనున్నాయన్న మాట. అయితే పేపర్ పై ఎలా ఉన్నా, అమలుకు ఇది సాధ్యం కాదన్న విషయం తెలిసిందే. దీంతో ఒక సినిమా అయితే ఖచ్చితంగా ముందుకో, వెనక్కో వెళ్ళడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ముందుకు వెళ్ళే సినిమాగా బాలకృష్ణ – పూరీల “పైసా వసూల్” సినిమా పేరు బలంగా వినపడుతోంది. అనుకున్న సమయాని కంటే ముందుగానే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, ఈ సినిమా విడుదలను ప్రీ పోన్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ప్రీ పోన్ అంటే ఒక వారమో, పదిహేను రోజులో కాదు, ఏకంగా సెప్టెంబర్ 1వ తేదీన “పైసా వసూల్” సినిమా విడుదల కావచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ డేట్ మిస్సయినా, సెప్టెంబర్ 8వ తేదీన పక్కాగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కాకపోతే బరిలో నుండి ఎన్టీఆర్ “జై లవకుశ” గనుక తప్పుకుంటే, ‘స్పైడర్’ కంటే ఒక వారం ముందుగా… అంటే ‘జై లవకుశ’ రిలీజ్ డేట్ కు ‘పైసా వసూల్’ను తీసుకురావాలని యోచిస్తున్నారు.

ఇదంతా ‘స్పైడర్’ విడుదల తేదీ ప్రకటనతో వచ్చిన తిప్పలు. నిన్న మొన్నటి వరకు దసరా ‘స్పైడర్’ విడుదలపై సందేహాలు నెలకొనడంతో, మిగతా సినిమాలన్నీ అనుకున్న సమయానికే విడుదల అవుతాయని భావించారు. అయితే రెండు రోజుల క్రితం “స్పైడర్” ప్రకటన రావడంతో, ఇప్పుడు మిగతా సినిమాలు తమ రిలీజ్ డేట్స్ పై మల్లగుల్లాలు పడుతున్నాయి. మరో కీలక అంశం ఏమిటంటే… ‘స్పైడర్’ను తప్పించుకుంటే, ఆ తర్వాత త్రివిక్రమ్ – పవన్ కాంబో సినిమా అక్టోబర్ కు రెడీ అవుతోంది.