Jai lava Kusa Jr NTR Promotions BIG Boss Teluguజూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తోన్న “బిగ్ బాస్” సీజన్ 1 ముగింపు దశకు చేరుకుంది. విజయం కోసం అయిదుగురు బరిలో ఉండగా, ఈ షో టాలీవుడ్ సినిమాలకు పబ్లిసిటీ పరంగా బాగా ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం రిలీజ్ అవుతున్న సినిమా సభ్యులు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్లి కాసేపు సందడి చేయడం కామన్ గా మారిపోయింది. తొలుత “నేనే రాజు నేనే మంత్రి” సినిమాతో మొదలైన ఈ హవా తాజాగా “జై లవకుశ” టీం వరకు చేరుకుంది. ఇదే చివరి చిత్రంగా కూడా చెప్పవచ్చు.

అవును… తను హీరోగా నటించిన సినిమా కోసం స్వయంగా తను హోస్ట్ చేస్తున్న కార్యక్రమంలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు యంగ్ టైగర్. ఓ పక్కన హోస్ట్ గా ‘బిగ్ బాస్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ… మరో పక్కన ‘జై లవకుశ’ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హౌస్ లోకి కూడా ప్రవేశించాడు జూనియర్. “జై లవకుశ” నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ మరియు చిత్ర హీరోయిన్లు రాశి ఖన్నా, నివేతా థామస్ లు కూడా హౌస్ లోకి అడుగుపెట్టి సందడి చేసారు. ఈ ఎపిసోడ్ శనివారం రాత్రి ప్రసారం కానుంది.

అయితే ఈ సెంటిమెంట్ మాత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. హౌస్ లోకి అడుగుపెట్టిన తొలి మూడు సినిమాలు “నేనే రాజు నేనే మంత్రి, అర్జున్ రెడ్డి, ఆనందో బ్రహ్మా” సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించగా, ఆ తర్వాత పబ్లిసిటీ కోసం అడుగుపెట్టిన అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి’ మరియు సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ సినిమాలు దారుణ ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో ఆ సీక్వెల్ లో మూడవ సినిమాగా ‘జై లవకుశ’ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.