Jagga Jasoos Ranbir Kapoor, Katrina Kaif promotionsప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాల తర్వాత తాను నటనకు దూరంగా ఉండబోతున్నట్లు టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ప్రకటించి, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తన సినిమాను పబ్లిసిటీ చేసుకునేందుకు వేసిన పాచిక పారకపోయేయప్పటికీ… విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఇదే బాటలో మరో బాలీవుడ్ హీరో ప్రకటన చేసేసాడు. అయితే ఈ సారి మరింత స్పష్టతతో ఈ ప్రకటన చేయడంతో… ఇందులో వాస్తవం ఉందన్న విషయం తెలిసింది.

రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న “జగ్గాజాసూస్” సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో… ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు రణబీర్. “తాను చాలా బద్దకస్తుడినని, తన తత్వానికి సినీ నిర్మాణం సరిపోదన్న విషయం ‘జగ్గా జాసూస్’తో తేలిపోయిందని, ఇక నుండి నటుడిగానే కొనసాగుతానని స్పష్టమైన ప్రకటన చేసాడు. రణ్‌ బీర్‌ కపూర్‌ తాత అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్‌ కపూర్‌ 1948లో ఆర్‌.కె.ఫిలిమ్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

అప్పట్లో ఆ బ్యానర్‌ పై చాలా సినిమాలు వచ్చినప్పటికీ, 1999 తరువాత ఆ బ్యానర్‌ పై సినిమాలు నిర్మిచడం మానేశారు. ఆ నిర్మాణ సంస్థ బాధ్యతలు తీసుకున్న రణ్‌ బీర్ కపూర్ “జగ్గా జాసూస్” నిర్మిస్తున్నట్టు తెలిపాడు. అలాగే వరుసగా సినిమాలు నిర్మించే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. కానీ, ఈ ఒక్క సినిమా నిర్మాణం చాలని, ఇకపై సినిమాలు తీయనని, నిర్మాతగా తన తొలి, చివరి సినిమా అని చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో కత్రినా కైఫ్ తో విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా ఆలస్యమైందని హల్చల్ చేసిన వార్తలు తెలిసినవే.