అధికారం చేపట్టిన నాటి నుండి వైసీపీ జెండా రంగులతో రాష్ట్రాన్ని ముంచెత్తిన ఘనతను చాటుకున్న జగన్ సర్కార్ పైన ఆఖరికి హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ మళ్ళీ సాధారణ రంగులు వేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడితో వైసీపీ సర్కార్ కు రంగుల పిచ్చి పోయి ఉంటుందని అంతా భావించారు.

కానీ తాజా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రేణిగుంట చేరుకున్న సమయంలో వైసీపీ నేతలు ఇచ్చిన పూలగుచ్చాలు రాష్ట్ర అధికార పార్టీ జెండా రంగులలో పోలి ఉండడం విశేషం. బహుశా ఈ బొకేలను అమిత్ షా కూడా అంతగా పరిశీలించకపోవచ్చు గానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా బీజేపీ దృష్టికి ఈ వైసీపీ రంగు బొకేల అంశం రాకమానదు.

అయినా జగన్ సర్కార్ కు మరీ ఇంత రంగుల పిచ్చి ఏమిటన్నది? సగటు ప్రజానీకానికి అర్ధం కాని అంశంగా మారింది. అంతకుముందు కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు చాలా కాలాలు పరిపాలించాయి గానీ, ఏ ప్రభుత్వము కూడా ఈ స్థాయిలో తమ పార్టీ రంగులను ప్రచారం చేసుకోలేదు. దీనిని పబ్లిసిటీ భాగంగా చేస్తున్నారో… ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ తో చేస్తున్నారో వైసీపీ వర్గీయులకైనా తెలుసో లేదో!?