కార్యనిర్వాహక రాజధాని పేరిట ఉత్తరాంధ్ర మీద గ్రిప్ సాధించాం అనుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ కు విశాఖ స్టీల్ ప్లాంట్ రూపంలో షాక్ ఎదురయ్యింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటన రావడంతోనే విశాఖ అట్టుడికిపోయింది. ఈ నెల 18 నుంచి ఉక్కు కార్మికులు వారి భార్యా బిడ్డలతో రోడ్ల మీదకు వచ్చి నిరవధిక నిరాహార దీక్షలకు కూడా సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే విశాఖపట్నం పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ పల్లా శ్రీనివాస రావు ఈ అంశంపై ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ విషయంలో సరిగ్గా స్పందించకుంటే ప్రజలతో ఇబ్బంది… స్పందిస్తే బీజేపీ తో ఇబ్బంది అన్నట్టు ఉంది జగన్ ప్రభుత్వం పరిస్థితి. ఇటువంటి కీలక తరుణంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం వెళ్ళబోతున్నారు.
శారదాపీఠం వార్షికోత్సవాల సందర్భంగా ఆయన ఈ నెల 17న విశాఖలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించనున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి ఈ అంశం మీద స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విశాఖ వచ్చి ఇటువంటి కీలక విషయంపై స్పందించకపోతే ఇబ్బందే అని పార్టీ నేతలే అనుకుంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో (POSCO) ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రధాన్ వెల్లడించారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకే మంత్రి ఈ సమాధానం చెప్పారు. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్తో 2019 అక్టోబర్లోనే ఒప్పందం కుదిరిందని తెలిపారు. 2020 అక్టోబర్ 29న పోస్కో ప్రతినిధులు ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. దానితో ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ మెడకు చుట్టుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది.