ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసారి గెలుపు తమదేనని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ చెప్పుకొచ్చారు. గత సారి 2014 లో చంద్రబాబు నాయుడుకు సంబందించి ప్రభుత్వ వ్యతిరేకతలేదని, కాని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోందని జగన్ అన్నారు.
గత ఎన్నికలలో బిజెపి, పవన్ కళ్యాణ్ లు టిడిపి సైకిల్ కు రెండు చక్రాలుగా పనిచేశారని,వారు ఇప్పటికే తప్పు కున్నారని ఆయన గుర్తు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పి మోసం చేశారని, గతసారి అన్ని అంశాలు చంద్రబాబుకు కలిసి వచ్చినా, తమకు ఆయనకు మధ్య కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని జగన్ అన్నారు.
ఈ సారి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తమ విజయం ఖాయమని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ను జగన్ పూర్తిగా తక్కువ అంచనా వేస్తున్నట్టు కనిపిస్తుంది. 2009లో మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొత్త పార్టీ చీల్చి అధికారపార్టీకి మేలు చేస్తే ఏంటి అనేది ఆయన అంచనా వెయ్యలేకపోతున్నారా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.