అదానీ గ్రూప్ విశాఖపట్నంలో తలపెట్టిన 70,000 కోట్ల డేటా సెంటర్స్ పార్క్ హైదరాబాద్ తరలిపోతుందని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జగన్ ప్రభుత్వం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి ఇచ్చిన వివరణ మరింత గందరగోళం సృష్టించేలా ఉండడం విశేషం.
20 ఏళ్ళ పాటు వివిధ దశల్లో 70000 కోట్లు పెట్టుబడి పెడతామని కంపెనీ వారు చెబితే ప్రభుత్వం అంత లాంగ్ టర్మ్ ప్లాన్ కుదరదని రెండేళ్ళ లో ఏం చెయ్యగలరో మాత్రమే చెయ్యాలని చెప్పారట. దీనితో వారు 70000 కోట్ల ప్రాజెక్టును 3000 కోట్లకు కుదించారట. 70000 కోట్ల ప్రాజెక్టుకు 800 ఎకరాలు ఎదగడమే ప్రభుత్వం ఒప్పుకోకపోవడానికి కారణమని కొందరు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు 3000 కోట్ల ప్రాజెక్టుకు కేవలం 89 ఎకరాలు సరిపోతాయట. విషయానికి వస్తే ప్రభుత్వం అప్పులలో ఉండటం, నవరత్నాలకు నిధులు లేకపోవడంతో భూములను అమ్మి సొమ్ము చేసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలో విశాఖపట్నంలో 800 ఎకరాలు ఆ కంపెనీకి ఇచ్చేస్తే నవరత్నాల అమలుకు అమ్మే భూములు తక్కువ అవుతాయి కాబట్టి అంతటి మెగా ప్రాజెక్టును వదిలేసుకున్నారట.
ఏ పెద్ద కంపెనీలకు అయినా, లాంగ్ టర్మ్ ప్లన్స్ ఉంటాయి రెండేళ్ళలో 70 వేల కోట్ల పెట్టుబడులు ఎవరూ పెట్టరు. మనకంటే ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఉండవు. భూములు అమ్మి, అప్పు తెచ్చుకుని, రేపు అన్నది ఆలోచించకుండా ప్రజలకు పప్పుబెల్లాలు ఇవ్వడంతో కాలం గడిపేస్తాం కంపెనీలు కూడా అలాగే ఉండాలి అంటే ఎలా అని పలువురు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.