ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతుందని, అత్యవసరంగా ఆర్టికల్ 360 ని అనుసరించి రాష్ట్రాన్ని కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ల సంగతి ఎలా ఉన్నా ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందనేది మాత్రం వాస్తవం.
జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా అప్పులు కోసం చూడాల్సిన పరిస్థితి. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే పర్లేదు… అడ్డదారులలో రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా అప్పులు తెస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ తీవ్రమైన విషయాలే. అయితే జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం మోడీ ప్రభుత్వానికి లేదట.
“ఈ తరుణంలో కేంద్రం ఏం చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ అది తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేస్తుంది. ప్రభుత్వ ఆర్ధిక స్థితి రెండు మూడు నెలలలో మరింత క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ప్రజలే ప్రభుత్వం మీద తిరగబడతారు. ఆ తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని చెయ్యాల్సింది చేస్తుంది,” అని బీజేపీలో కొందరు అంటున్నారు.
“ప్రస్తుతానికి ఏదో రకంగా ప్రజలకు నొప్పి తగలకుండా ప్రభుత్వం మ్యానేజ్ చేస్తుంది. అయితే ఇది ఎంతో కాలం సాగదు. పరిస్థితి తీవ్రత ప్రజలకు తెలిసేదాకా జగన్ ప్రభుత్వం జోలికి వెళ్ళాక పోవడమే ఉత్తమం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోశారు అనే అపప్రధ మోడీ ప్రభుత్వానికి అవసరం లేదు,” అని బీజేపీ నాయకుల అభిప్రాయమట.