అసలే లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం… ఆ పై లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు… ఈలోగా కరోనా కాటు… అన్నీ కలిసి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేసాయి. కనీసం ఒక ఏడాది పాటు ఆర్ధిక మందగమనం ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో నిధుల సమీకరణకు తిప్పలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
దీనిలో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతలో విశాఖ, గుంటూరు తొమ్మిది చోట్ల భూములు అమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వం..విశాఖలో ఆరు, గుంటూరులో మూడు ప్రాంతాల్లో భూములను బిల్డ్ ఏపీ మిషన్ వేలం వెయ్యనుంది.
300 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. అయితే బిల్డ్ ఏపీ అని పేరు పెట్టి ఉన్నవి తెగనమ్మడంపై విమర్శలు వస్తున్నాయి. “అధికారంలోకి వచ్చిన ఏడాదిలో అభివృద్ధి సూన్యం. కేవలం వేరు వేరు పేర్లతో పంచిపెట్టడం తప్ప,” అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
“ఆర్ధిక మందగమనం సమయంలో ఆస్తులు అమ్ముకోవడం దండగ. వీటికి మంచి రేట్లు పెట్టడానికి ఎవరూ ముందుకు రారు. ఇది అన్ని విధాలా నష్టదాయకం,” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “చంద్రబాబు అధికారం ఉన్న ఐదేళ్లలో ఎప్పుడు అమ్మకాలు లేవు, జీతాలు సమయానికి పడ్డాయి, అమరావతి నిర్మాణం, పోలవరం పరుగులెత్తించారు… ఏడాది ముగియక ముందే అమ్మకలకు తెగబడ్డారు. ఇదే అదనుగా అయిన వాళ్ళకి తక్కువకి భూముల కట్టబెడతారు. సంపద సృష్టించడం చేతకాకపోతే దిగిపోవాలి,” అంటూ టీడీపీ వారు విమర్శిస్తున్నారు.