వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ ఇంపాక్ట్ బాగా తెలిసివస్తోంది. ఓ చేత్తో సంక్షేమ పధకాలకు డబ్బులు పంచుతూ మరో చేత్తో ఛార్జీలు, రకరకాల పన్నులతో ఆ సొమ్మును ప్రజల నుంచే తీసుకొంటోంది. ఓట్ల కోసం కొన్ని వర్గాలకు సంక్షేమ పధకాల పేరుతో డబ్బులు పంచుతూ, ఆ సొమ్మును వారితో సహా రాష్ట్రంలో మిగిలిన అన్ని వర్గాల వారి నుంచి ముక్కు పిండి వసూలు చేసుకొంటోంది. ఇప్పటికే చెత్త పన్నుతో ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా ‘ఇంపాక్ట్ ఫీజ్’ పేరుతో మరో కొత్త పన్నును అమలులోకి తెచ్చింది.
దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 60,80,100 అడుగులు అంతకు మించి వెడల్పున్న రోడ్ల పక్కన కొత్తగా ఇళ్ళు, అపార్టుమెంట్స్ నిర్మించుకొనేవారు ఇంపాక్ట్ ఫీజ్ చెల్లించాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రహదారులకు 250 అడుగుల దూరంలో నిర్మించే అన్ని పారిశ్రామికేతర వాణిజ్య భవనాలకు కూడా ఇది వర్తిస్తుంది. లైసెన్స్ ఫీజ్, డెవలప్మెంట్ ఛార్జీలు, బెటర్మెంట్ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు, వాటర్ ఛార్జీలు, ఓపెన్స్ స్పేస్ ఛార్జీలు తదితర చార్జీలకు ఇంపాక్ట్ ఫీజ్ అదనం. భవనాల బిల్టప్ ఏరియా లేదా ఆయా ప్రాంతాలలో స్థలం రిజిస్ట్రేషన్ విలువలో 2 నుంచి 3 శాతం వరకు ఏది ఎక్కువైతే దాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ముతో రాష్ట్రంలో రహదారుల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణాలు, ఫ్లైఓవర్ ఓవర్ల నిర్మాణాలు చేపడతామని తెలిపింది.