ఆంధ్రప్రదేశ్ లోని కొత్త ప్రభుత్వం మొదటి నుండీ అమరావతి అనే మార్కు చేర్పివేసే ప్రయత్నమే చేస్తుంది. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది అందుకే. మొదట్లో మూడు రాజధానులని చెప్పినా ముందు ముందు విశాఖ మాత్రం రాజధాని గా చేస్తారనేది చాలా మంది అభిప్రాయం.
ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు అమరావతి పేరు కూడా ఉండకూడదు అన్నట్టు ప్రభుత్వం సాగుతుంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్ సీ)గా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్యామలరావు పేరుతో సోమవారం ఈ మేరకు జీవో వెలువడింది.
విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఏర్పాటుచేసే క్రమంలో… ఇది వరకే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ను నెలకొల్పారు. అయితే లక్నో మెట్రో రైల్ కార్పొరేషన్ ను ఉత్తర్ ప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ గా మార్చారు అనే నెపంతో అమరావతి పేరు తొలగించడం విశేషం.
“ఇవన్నీ వంకలు మాత్రమే… అమరావతి అనే పేరు సైతం ముఖ్యమంత్రి జగన్ కు పొసగడం లేదు. కరోనా ప్రభావం లేకపోతే ఇప్పటికే రాజధానిని తరలించే వారు,” అంటూ అమరావతికి భూములిచ్చిన రైతులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. విజయవాడని, అమరావతిని అనుసంధానం చేసే మెట్రో ప్రాజెక్టుని ప్రభుత్వం అటకెక్కించినట్టే అని అధికార వర్గాలు అంటున్నాయి.