అసెంబ్లీలో రోజా పలికిన అసభ్య పదజాలం ఇంటర్నెట్ లో సందడి చేయడంతో… అప్పటివరకు ఆమెకు అండగా నిలిచిన అధినేత జగన్ పరువు పోయినట్లయ్యింది. దీనిపై ఫైర్ అయిన జగన్ వర్గం రోజా మాట్లాడిన వీడియో ఫుటేజ్ ఒక్కటే ఎలా బయటికి వచ్చిందని మండిపడ్డారు. అంతేకాదు దీనికి నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఏపీ శాసనసభ కార్యదర్శి సత్యనారాయణను కలిసిన నోటీసులు అందజేసారు.
తాజాగా దీనిపై స్పందించిన జగన్, “వచ్చే అసెంబ్లీ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, దానిపై అందరి ఎమ్మెల్యేల అభిప్రాయం చెప్పడం, ఆ తర్వాత స్పీకర్ ను తిట్టడం ఖాయమని” అన్నారు. “ముఖ్యమంత్రిని అందరం ‘కామా సిఎం’ అని పిలిచామని… ‘కామా’ అంటే ‘కాల్ మనీ’ అని, అయితే ఒక్క రోజమ్మను మాత్రమే సస్పెండ్ చేసారని, అసలు సస్పెండ్ చేసే అధికారాలు స్పీకర్ కు లేవని జగన్ స్పీకర్ కోడెలపై ఆరోపణలు చేసారు.
అయితే, ఇప్పటికీ రోజాను వెనుకేసుకు వస్తున్న జగన్ తీరు చూస్తుంటే… టిడిపి సభ్యులు ఆరోపిస్తున్నట్లు నిజంగానే జగన్ కావాలనే రోజాతో ఆ బూతులు పలికించారా… అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొరపాట్లు జరగడం సహజమే కనుక, జరిగిన తప్పును గుర్తించి, దానిని సవరించుకుంటామన్న హామీ ఇస్తే, కనీసం నాయకుడిగా జగన్ పరిపక్వతను ప్రదర్శించిన వారయ్యేవారు. అలా కాకుండా తప్పు మీద తప్పు చేసుకుంటూ… రోజాను అంతకంతకూ సమర్ధించుకుంటూ జగన్ తన గోతును తానే త్రవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.