ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రకటించిన నాటి నుండీ ఆ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి మనసులో మాటని రిపోర్టుగా తయారు చేసారో ఏమో గానీ జీఎన్ రావు కమిటి కూడా అదే చెప్పింది. ఈ ప్రతిపాదనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలా ఉండగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే జగన్ కు ఇండైరెక్టుగా మద్దతు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అమరావతిని మొత్తానికి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు జగన్ ని అభినందించడం విశేషం.
“రాజధాని విషయంలో జగన్ గారు ఒక ప్రణాళిక కనుగుణంగా ముందుకు పోతున్నట్లు అనిపిస్తున్నది. శాసనసభ రాజధానిగా తాయిలం చూపి ముందు పరిపాలన రాజధాని ని విశాఖకు మార్చటం. ఆపైన అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ముందు కుదించటం క్రమంగా అమరావతి చాప్టర్ ముగించటం సులభం. దీర్ఘకాలంలో విశాఖ రాజధాని. హైకోర్టు కర్నూల్,” అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పినట్టుగానే ముందు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పినా, జీఎన్ రావు కమిటి కేవలం అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు మాత్రమే అమరావతిలో జరపాలని చెప్పడం విశేషం. ఐవైఆర్ కృష్ణారావుకు జగన్ ప్రభుత్వం నుండి ఖచ్చితమైన సమాచారం రావడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసారా అనే అనుమానాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు.