IT Sector in Hyderabad Increased due to Fee Reimbursementఅప్పుడెప్పుడో జలీల్ ఖాన్ ‘బికాం’ ఉదంతం గుర్తుంది కదా! ఏ విధంగా ఆ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుశా దానిని మించిపోవాలని వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారధి గారు చేసిన ప్రయత్నంలో భాగమో ఏమో గానీ, ప్రస్తుతం ఓ వీడియోతో ట్విట్టర్ ను ఊపేస్తున్నారు.

మరి అంతలా ఒక ప్రజాప్రతినిధి ఏం అన్నారు? అంటే… మంగళవారం నాడు అసెంబ్లీలో పార్ధసారధి చేసిన వ్యాఖ్యలే ఈ హంగామాకు అసలు కారణం. ‘బికాం లో ఫిజిక్స్’ అన్నా ఏదో పొరపాటుకు తావు ఉండొచ్చు గానీ, వైసీపీ ఎమ్మెల్యే గారు ఏకంగా ‘బోడి గుండుకు మోకాలు’కు లింక్ పెట్టేశారన్నది ఇంటర్నెట్ టాక్.

“హైదరాబాద్ లో చంద్రబాబు హైటెక్ సిటీ అనే ఒక్క బిల్డింగ్ కట్టావేమో… కానీ ప్రపంచంలో ఉన్న కంపెనీలు అన్ని వచ్చాయంటే కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఫీజు రీ ఎంబర్సుమెంట్ మూలంగా” అంటూ వ్యాఖ్యలు చేసారు. ఏంటి… కామెడీ అనుకుంటున్నారా? నిజంగానే అన్నారండి బాబు!

ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత సొంత పార్టీ వర్గాలే బయటకు చెప్పుకోలేక సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నెటిజన్లు ఆగుతారా?అందుకే ఈ వీడియో ఆ స్థాయిలో హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరో జగమెరిగిన సత్యం. ప్రస్తుతం తెలంగాణను పరిపాలిస్తున్న నేతలు కూడా వివిధ సందర్భాలలో వెల్లడించారు.

అయినా వైఎస్సార్ ఫీజు రీ ఎంబర్సుమెంట్ కు – ప్రపంచ కంపెనీలన్నీ హైదరాబాద్ కు రావడం ఏంటో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు నెటిజన్లు. ‘అతడు’ సినిమాలో పార్ధుపై త్రిష వేసిన డైలాగ్ ఈ సందర్భంగా మరోసారి హైలైట్ అవుతోంది. అయినా ఈ రచ్చలోకి “పెద్దాయన” (వైఎస్సార్)ను లాగడం ఏంటో!

ప్రత్యర్థి పార్టీ పైన ఏదొక రకంగా బురద జల్లెద్దామని చేసే ప్రయత్నంలో… మన మీద బురద పడకుండా జాగ్రత్త పడాలి కదా సుమీ..!