ఓ పక్కన రాజకీయం రాజ్యమేలుతున్న వేళ… మరో పక్కన సంక్రాంతి సినిమాల కలెక్షన్ల గురించి అభిమానులు వాగ్వివాదాలు జరుగుతున్న వేళ… ఓ అద్భుతమైన ప్రయోగానికి తెలుగు నేల సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన సర్వహంగులను ఇస్రో సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 8.39 గంటలకు పీఎస్ఎల్వీ-సీ37 వాహక నౌక ద్వారా ఒకేసారి 103 ఉపగ్రహాలను ప్రయోగించనుంది.
ఇస్రో ప్రయోగించనున్న 103 ఉపగ్రహాల్లో 3 ఉపగ్రహాలు ఇండియాకు చెందినవి కాగా, 100 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కావడం గమనార్హం. ఇస్రో ప్రయోగించనున్న వంద విదేశీ ఉపగ్రహాలు బుధవారం తెల్లవారుజామున నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి చేరుకున్నాయి. వీటిలో అమెరికా, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన శాటిలైట్లు ఉన్నాయి. ఈ ప్రయోగం కోసం ప్రపంచం మొత్తం తెలుగు నేల వైపుకు చూస్తోంది.