ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు అయ్యింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ రాశారు. తిరుపతి సభకు నేను హజరైతే వేలాదిగా జనం తరలివస్తారు.
ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగన్ నిర్ణయం అందరినీ విస్మయపరిచింది. కరోనా వచ్చిన నాటి నుండీ జగన్ ఎప్పుడూ దానిని సీరియస్ గా తీసుకోలేదు. మొదట్లో పారాసిటమాల్ తీసుకుంటే చాలని, కేసులు పెరుగుతున్నా ఎన్నికలు కావాలని జగన్ విస్మయపరిచారు.
కరోనా ఎక్కువగా ఉన్న రోజులలో ముఖ్యమంత్రి మాస్కులు పెట్టుకోకపోవడం, ఆ పార్టీ నాయకులు ర్యాలీలు, సంబరాలు చేసుకోవడం అందరం చూశాం. ఇటువంటి తరుణంలో ముఖ్యమంత్రి కరోనా కారణంగా ఎన్నికల సభను రద్దు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మాత్రం ఎవరు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. టీడీపీ మాత్రం తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఓటమి తధ్యమని తెలిసి ఓటమి బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.