కంగనా రనౌత్, కరణ్ జొహార్… వీరిద్దరి మధ్యా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం బాలీవుడ్ వర్గాలకు తెలియనిది కాదు. కానీ విరుష్క రిసెప్షన్ లో ఒకరినొకరు పలకరించుకున్నపుడు ఆ అభిప్రాయం మారింది. ఇక ఆదివారం రాత్రి కంగనా, కరణ్లని ఒకే వేదిక మీద చూసి ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకునే పరిస్థితి నెలకొంది.
అవును… కరణ్ జొహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఇండియాస్ నెక్స్ట్ సూపర్స్టార్’ కార్యక్రమానికి కంగనా అతిథిగా హాజరైంది. స్టేజీ మీద నవ్వుతూ వారిద్దరూ ప్రాణస్నేహితుల్లా కనిపించారు. దీన్ని చూసి వారిద్దరి మధ్య కొత్త స్నేహం చిగురించిందనేది బాలీవుడ్ టాక్. దీంతో తాజాగా దీనిపై మీడియాతో మాట్లాడిన కంగనా…
తమ ఇద్దరి మధ్య గతంలో జరిగిన వాగ్వివాదం కేవలం సినీ రంగానికి సంబంధించిన సమస్యలపైనే గానీ… వ్యక్తిగతమైనది కాదని, తమ మధ్య కొత్త స్నేహం, పాత స్నేహం అంటూ లేవని, ఎప్పటిలాగే ఉన్నామని కంగనా అంది. అలాగే స్వాభిమానం గురించి తన అభిప్రాయాలు కూడా మారలేదని ఆమె చెప్పింది.
ఇదిలా ఉండగా… ఈ కార్యక్రమంలో హృతిక్ రోషన్ గురించి కంగనా పరోక్షంగా ప్రస్తావించడం హైలైట్గా నిలిచింది. మీ లవ్స్టోరీ గురించి చెప్పాలని అడగ్గా… తన లవ్స్టోరీ గురించి అందరికీ తెలుసునని, మీడియాలో గొప్ప గొప్ప కథనాలు కూడా వచ్చాయని కంగనా సెటైరికల్ తో కూడిన జోక్ చేసి, అందరినీ నవ్వించింది.