ipl-banఇండియా క్రికెట్ ప్రేమికులనే కాదు, యావత్తు ప్రపంచాన్నే ఊపేసే “ఇండియన్ ప్రీమియర్ లీగ్” (ఐపీఎల్) రద్దు కానుందా? అంటే అవుననే బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. బీసీసీఐ మానసపుత్రిక అయిన ఐపీఎల్ ఆరంభం తరువాత భారత్ లో బీపీఎల్ (బ్యాడ్మిటన్ ప్రీమియర్ లీగ్), ఐటీపీఎల్ (ఇండియన్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్), ప్రొ కబడ్డీ లీగ్, ఐఎస్ఎల్ (ఫుట్ బాల్ ఛాంపియన్స్ లీగ్) ఇలా ఎన్నో లీగులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటికీ ఆది గురువు ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ ను బీసీసీఐ రద్దు చేసుకోనున్నట్టు తెలుస్తోంది.

లోథా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ప్రతి టోర్నీకి మధ్య 15 రోజుల వ్యవధి ఉండాలి. అలా లేకపోవడంతో రెండు టోర్నీల్లో ఏదో ఒక దానిలో టీమిండియా పాల్గొనాల్సి ఉంది. ఐతే ఛాంపియన్స్ లీగ్ కూడా బీసీసీఐ రూపకల్పన చేసినదే కావడం విశేషం. ఈ నేపధ్యంలో ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తో వివాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఐసీసీతో బీసీసీఐకి చిన్న చిన్న విబేధాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ కు విడుదల చేసిన నిధులు విషయంలో ఈ విభేధాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఐసీసీతో వివాదం కంటే దేశీ టోర్నీ అయిన ఐపీఎల్ ను రద్దు చేయడమే సరైన నిర్ణయమని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే లోధా కమిటీతో బీసీసీఐ కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇండియాలోని క్రికెట్ ప్రేమికులకు భారీ షాక్ తప్పదు. అలాగే ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను తమ ప్రాంచైజీల మీద పెట్టుబడులు పెట్టిన కార్పొరేట్ దిగ్గజాలు కూడా అవాక్కవ్వాల్సిందే.