indian-army-surgical-strikeలైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద ఉగ్రవాదుల కదలికలు ఎక్కువయ్యాయని, ఏ క్షణంలో అయినా తాము దాడికి దిగే అవకాశం ఉందని గతంలో పాకిస్థాన్ కు చెప్పామని డీజీఎంవో తెలిపారు. అలాగే తాజాగా జరిగిన “సర్జికల్ స్ట్రైక్స్”పై కూడా సమాచారం ఇచ్చామని అన్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో ఈ సంయుక్త దాడులు చేశామని, అర్ధరాత్రి 12:30 నిమిషాలకు శత్రుదేశం సరిహద్దుల్లోకి దూసుకెళ్లిన మన సైనిక నిపుణులు 4:30 కల్లా తిరిగి వచ్చేశారని, నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లకు యత్నించే వారికి ఇదొక గుణపాఠమని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ప్రతిదాడికి పాకిస్థాన్ దిగే అవకాశం ఉందని భావించిన ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దుల్లకు పది కిలోమీటర్ల లోపు ఉన్న గ్రామీణులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడంలో తలమునకలైంది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించి, పాక్ నుంచి ఎదురయ్యే ప్రతిఘటనకు గట్టి సమాధానం చెప్పాలని భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే సరిహద్దు గ్రామాల ప్రజలకు, వాఘా బోర్డర్ లోని సైన్యానికి హెచ్చరికలు జారీ చేసింది. దొంగచాటున దెబ్బ కొట్టడం పాకిస్తాన్ వంతయితే, చెప్పి చేయడం ఇండియా స్పెషాలిటీ అని సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.