పొరుగున ఉన్న పాకిస్థాన్ తో 10 రోజుల పాటు, చైనాతో 15 రోజుల పాటు యుద్ధం చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని తన కమాండర్లకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో ఐఏఎఫ్ కమాండర్ల సదస్సు జరుగగా… ఐఏఎఫ్ చీఫ్ బీఎస్ ధనోవా ఈ మేరకు కమాండర్లకు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. యుద్ధం సంభవిస్తే, పాక్ ను 10 రోజుల పాటు, చైనాను 15 రోజుల పాటు ఎదుర్కోవడానికి వీలుగా కమాండర్లు సిద్ధంగా ఉండాలని చెప్పినట్లుగా ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి.
అందుబాటులోని యుద్ధ విమానాలు, పూర్థి స్థాయి ఆయుధాలు, క్షిపణులు సిద్ధం చేసుకోవాలని, పోరాట సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించినట్టు చెప్పారు. శత్రుదేశాల నుంచి దూసుకు వచ్చే క్షిపణులపై సమాచారాన్ని అందించే అలర్ట్ రాడార్ సిస్టమ్ ను రెడీగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇన్స్ పెక్షన్ కు ఆదేశాలు ఇస్తూ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సన్నద్ధం కావాలని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. దీంతో త్వరలో పాకిస్తాన్, చైనాలతో ఇండియా యుద్ధం చేయనుందన్న వార్తలు ప్రధానంగా మారాయి.