స్వదేశంలో 250వ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా తొలి రోజు ఎప్పటిలాగానే చతికిలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి రోజు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ బౌలర్లు బౌల్ట్, హెన్రీ విజృంభించడంతో భారత్ 46 పరుగులకే 3 టాప్ ఆర్డర్ వికెట్లు పడిపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, విజయ్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. శిఖర్ ధావన్ ఒక పరుగుకే వెనుదిరగగా, మురళీ విజయ్ 9 పరుగులు, కెప్టెన్ కోహ్లి 9 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తరువాత క్రీజులోకొచ్చిన చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే అద్భుతంగా రాణించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. పూజారా 87 పరుగులు, అజింక్యా రహేనే 77 పరుగులు చేసి ఔటయ్యారు.
ఈడెన్ లో రాణిస్తాడనుకున్న రోహిత్ శర్మ కూడా 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అశ్విన్ 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి సహా 26, జడేజా 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తేనే కనీసం 300 పరుగుల మార్క్ అయినా అందుకోగలుగుతుంది, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రీడా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.