స్వదేశం నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో అత్యధికంగా భారతీయులే ఉన్నారని ‘ప్యూ రీసెర్చ్’ కేంద్రం ప్రకటించింది. దీంతో అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాలన్నింటి కన్నా మనదేశమే మొదటి స్థానంలో నిలిచింది. ఇతర దేశాల్లో నివసిస్తోన్న భారతీయుల సంఖ్య 1 కోటి 56 లక్షలుగా ఉందని ప్యూ రీసెర్చ్ పేర్కొంది. ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి వలసలు వెళ్లిన వారి సంఖ్య ప్రపంచ జనాభాలో 3.3 శాతంగా ఉందని తెలిపింది.
2015లో యూఏఈలో నివసిస్తోన్న భారతీయుల సంఖ్య 35 లక్షలుగా పేర్కొనగా, ఆ దేశంతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా ఇండియా నుంచి ప్రజలు అత్యధిక సంఖ్యలో వలసలు వెళ్లారని చెప్పింది. గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంఖ్య గత ఏడాది 80 లక్షల మందికి పైగా ఉందని, ఈ సంఖ్య 1990లో 20 లక్షలని తెలిపింది. భారత్ తరువాత అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశంగా మెక్సికో నిలిచింది.
ఆ దేశం నుంచి ఇతర దేశాలకు కోటి 23 లక్షల మంది వలసలు వెళ్లారు. ఇక ఆ తరువాతి స్థానాల్లో కోటి 6 లక్షల మందితో రష్యా, 95 లక్షల మందితో చైనా, 72 లక్షల మందితో బంగ్లాదేశ్ ఉన్నాయి. అయితే ఆయా దేశాల నుండి అత్యధికంగా అమెరికాకే వలసలు వెళ్లారు. మొత్తం 4 కోట్ల 66 లక్షల మంది వలసదారులతో అత్యధికంగా వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన దేశంగా అమెరికా నిలిచింది. ఇదే అంశంలో రెండో స్థానంలో కోటి 20 లక్షల మందితో జర్మనీ, కోటి 16 లక్షల మందితో రష్యా, కోటి 2 లక్షల మందితో సౌదీ అరేబియా, 85 లక్షల మందితో బ్రిటన్ దేశాలు ఉన్నాయి.