income-tax-raids-had-1138-crores-after-raidsనల్లకుభేరుల, అవినీతిపరుల ఆట కట్టించే ఉద్దేశ్యంతో గత ఏడాది నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగి పలు చోట్ల సోదాలు నిర్వహించారు. నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మర్నాటి నుంచి అంటే నవంబర్ 9వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ వరకు ఐటీ అధికారులు చేపట్టిన సోదాల్లో 4,807 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ మొత్తం కూడా వెల్లడించని లేదా లెక్కల్లో చూపని సొమ్ముగానే అధికారులు తెలిపారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తంలో 112 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉండగా, ఆ నోట్లలో అధిక శాతం రెండు వేల రూపాయల నోట్లే ఉన్నాయి. కాగా, నవంబర్ 9 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 1138 చోట్ల సోదాలు నిర్వహించామని, 5184 మందికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.