Ilayaraja-Legal-Notice- to SP-Balasubrahmanyamవరల్డ్ టూర్ లో భాగంగా పలు దేశాల్లో కచేరీలు ఇస్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎక్కువగా ఇళయరాజా పాటలు పాడుతున్నారని, ఇంకెప్పుడూ ఆ పాటలు పాడకూడదంటూ… ‘మ్యూజిక్ మేస్ట్రో’ ఇళయరాజా పేరిట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు వచ్చాయి. ఈ విషయమై తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ… గత ఆగస్టులో ‘ఎస్పీబీ 50’ పేరిట తన కుమారుడు చరణ్ ఈ టూర్ కార్యక్రమం ప్రారంభించాడని, ఇందులో భాగంగా తాము భారత్ తో పాటు టొరంటో, రష్యా, శ్రీలంక, మలేసియా, సింగపూర్, దుబాయ్ ల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చామని చెప్పారు.

అయితే అప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, గత వారం సియాటిల్, లాస్ ఏంజిల్స్ లో మంచి కచేరీలు ఇచ్చామని, అమెరికాలో కచేరీ నిర్వహిస్తుంటే ఈ నోటీసుల గొడవ మొదలైందని, ఈ నోటీసుల విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని, చట్టాన్ని తాను గౌరవిస్తానని…. ఈ పరిణామాలతో ఇళయరాజా పాటలు పాడలేమని, అయితే కచేరీలు మాత్రం జరగాల్సిందేనని స్పష్టం చేసారు. వాళ్లకి తాను విన్నవించుకునేది ఒకటేనని… దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేసి, తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు. అయితే పాటలు పాడినా కూడా నోటీసులు పంపవచ్చా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఎస్పీ అభిమానుల వంతవుతోంది.