మెట్రోరైలు ప్రయాణ ఛార్జీలు ఖరారయ్యాయి. కనీస ఛార్జీ రూ.10 కాగా గరిష్ఠంగా రూ.60గా నిర్ణయించారు. దూరాన్ని బట్టి 10 శ్లాబులుగా విభజించారు. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో ఒప్పందం కంటే 200 శాతం ఎక్కువగా మారాయి. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలతో పోల్చితే హైదరాబాద్ మెట్రో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
దిల్లీ మెట్రోలో ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.15 టికెట్ కొనాలి. హైదరాబాద్ మెట్రోలో రూ.25 టికెట్ తీసుకోవాలి. ఎక్కువ స్లాబ్ల ద్వారా ప్రజలపై భారాన్ని మోపారు. బెంగళూరు మెట్రోలో కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.48. ఇక్కడ 42 కి.మీ. దూరంలో మెట్రో తిరుగుతోంది. హైదరాబాద్లో 26 కి.మీ. దాటితే రూ.60 పెట్టాల్సిందే.
మెట్రో వాళ్ళ తమకు ఆధరణ తగ్గుతుందని భావించిన ఆర్టీసీ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. తమ ఏసీ ఎక్సప్రెస్ బస్సు చార్జీలు కూడా మెట్రో కంటే తక్కువే అనే వారు చెప్తున్నారు. అదే సమయంలో మెట్రోతో ట్రాఫిక్ సమస్యలు ఉండవు, ప్రయాణ సమయం తగ్గుతుంది. కాబట్టి ఇది ఎలా పరిణమిస్తుందో చూడాలి.
ఒక కుటుంబంలో ఇద్దరు మియాపూర్ నుంచి నాగోల్ వరకు మెట్రోలో వెళ్లి వస్తే రూ.400 ఖర్చవుతుందన్నారు (పార్కింగ్ చార్జీలతో కలిపి). తమ నాన్ ఏసీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇదే దూరం ప్రయాణిస్తే ఒక్కొక్కరికి రూ.35 ఛార్జి అని, అంటే ఒక్కో ప్రయాణికుడికి 145 ఆదా అవుతుందని చెప్పారు. అయితే క్యాబ్ లలో ప్రయాణించేవారికి మాత్రం ఇది బెనిఫిట్ అనే చెప్పుకోవాలి.
దిల్లీ మెట్రోలో ఇటీవల రేట్లు పెంచడంతో రోజుకు మూడు లక్షల మందికిపైగా ప్రయాణికులు తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. దిల్లీలో పెరిగిన రేట్ల కంటే కూడా హైదరాబాద్ మెట్రోలో కొన్ని స్లాబుల్లో రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ప్రజలు దీనిని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి!