నాణేం ఇరువైపులా గెలుపోటములాంటిది. ఉదాహరణకు తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ లాగా. రెండు అధికార పార్టీలే. తెలంగాణలో అధికార పార్టీ ఓడితే….ఏపీలో విజయం సాధించింది. హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణలో అధికార పార్టీకి ఛేదు అనుభవాన్ని మిగిల్చగా…ఏపీలో బద్వేల్లో వైసీపీ భారీ మెజార్టీ లభించింది. బద్వేల్ ఫలితాలు వైసీపీలో ఫుల్ జోష్ నింపాయి. అయితే ఇక్కడే జగన్ సర్కార్ ఓ విషయాన్ని గమణించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే సంక్షేమ పథకాల అమల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు హుజూరాబాద్ ఫలితం ఓ హెచ్చరికలాంటిదే అంటున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే హుజూరాబాద్ ఉపఎన్నికను ద్రుష్టిలో పెట్టుకుని టీఆరెస్ ప్రభుత్వం దళితబంధు తెరపైకి తెచ్చింది. కానీ టీఆరెస్ విజయం సాధించలేదు. కేవలం సంక్షేమ పథకాలే తనను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై అధిరోహిస్తాయని…వైఎస్ జగన్ నమ్ముతున్నారు. ఈ సందర్భంలో హుజూరాబాద్ ఫలితాన్ని అధ్యయనం చేయడం మంచింది. ఎందుకంటే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 23వేల 183 దళిత కుటుంబాల్లో 40వేలకు పైగా ఉన్న దళిత ఓట్లన్నీ కూడా తామే దక్కించుకోవాలన్న అత్యాశతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారు.

దళితబంధు పథకం ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఒక్కో కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇస్తామన్నా…చివరికి అనుకున్నట్లుగా ఓట్లు పడలేదన్న వాస్తవాన్ని బీజేపీ విజయమే చెబుతోంది. బద్వేల్లో భారీ మెజార్టీతో విజయం సాధించడానికి అనేక కారణాలు ఉండచుగాక. గతంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఆయన సతీమణి సుగుణమ్మ లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.

ఆ ఉపఎన్నికకు వైసీపీ పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ చేతిలో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. నంద్యాల ఉపఎన్నిక, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉన్నాయో జగన్ కు బాగా తెలుసు. ఉప ఎన్నిక విజయమే సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందనే భ్రమ నుంచి బయటకు రావాలన్నదే ఈ ఉదాహరణలు. ఇక ఏపీలో సంక్షేమ పథకాల అమలు విజయవంతంగా సాగుతున్నాయి. అయితే సంక్షేమం మాత్రమే…అభివృద్ధి శూన్యం అనేది బాహాటంగానే చెప్పవచ్చు. తమ కష్టాన్ని అప్పన్నంగా సర్కార్ దోచుకుంటుంటే…ఒక వర్గం ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. బద్వేల్ ఎన్నికల భ్రమలో నుంచి ప్రభుత్వం బయటకు రాకుంటే…రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు. గతంలో చంద్రబాబు ఇలాంటి తప్పిదాలు చేశారు. 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు టీడీపీ పరిమితం కావడంతో చంద్రబాబు భ్రమలో నుంచి బయటకు వచ్చారు.

కాబట్టి అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందే విధంగా సీఎం జగన్ చర్యలు చేపట్టాలి. తమ పాలనలోని లోపాలను గుర్తించి…సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా సమయం ఉంది. దాదాపు రెండున్నరేళ్ల పాలనా కాలం ఉంది. ఈ కాలంలో ఎన్నో అభివ్రుద్ధి పనులు చేయోచ్చు. పాలనను అందరికీ ఆమోదయోగ్యంగా సవ్యంగా నడిపించవచ్చు. ఉద్యోగులు, రైతులు, మధ్య తరగతి ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా అందరి మనసులు గెలుచుకునేలా పాలనను అందించాలి. అది చేస్తే వైఎస్ జగన్ మరోసారి తిరుగుండదు. లేదంటే ఓ చంద్రబాబు…ఓ కేసీఆర్ ఓటములు కళ్లెదుటే కనిపిస్తున్నాయి.