తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలు విపత్తులు సంభవించినప్పుడు ఎప్పుడూ ముందు ఉండి తమవంతు సాయం చేస్తారు. కరోనా విపత్తు సమయంలోనూ గట్టిగానే విరాళాలు ఇచ్చారు. అటు ప్రభుత్వ సహాయ నిధులకే కాకుండా సినీ కార్మికుల సంక్షేమ నిధికి కూడా భారీగానే విరాళలలు ఇచ్చారు. అయితే అంతా ఇస్తున్న సమయంలో కొందరి దృష్టి మాత్రం బాలయ్య మీదే ఉంది.
బాలయ్య ఏమీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అలాగే కొందరైతే బాలయ్య కోటి రూపాయల సహాయం ప్రకటించాడన్న తప్పుడు వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను కూడా వాడి బాలయ్య ఏమీ ఇవ్వలేదు, తప్పుడు వార్తలతో ఇచ్చాను అనిపించుకున్నాడు అంటూ విమర్శించారు. అయితే ఈ విమర్శలకు బాలయ్య గట్టిగానే సమాధానం చెప్పాడు.
కోటి కాదు ఏకంగా కోటీ పాతిక లక్షలు విరాళం ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సంక్షేమ నిధులకు చెరో యాభై లక్షలు…. సినీ కార్మికుల సంక్షేమ నిధికి మరో పాతిక లక్షల విరాళం ప్రకటించాడు. ఆ పాతిక లక్షల చెక్ ను స్వయంగా హై పవర్ కమిటి సభ్యుడు సీ కళ్యాణ్ కు అందించారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఒక నెల జీతం విరాళంగా ఇస్తారని ప్రకటించింది. ఆ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య కూడా ఒక నెల జీతం ఇచ్చినట్టే. ఇది ఇలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. రెండు రాష్ట్రాలలోనూ కేసులు ఇప్పటికే 150కి పైగా నమోదు అయ్యాయి.