Hero Shivaji Nandi Awards Controversyనంది అవార్డుల చర్చల సీక్వెల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నాలుగు రోజులుగా కొనసాగుతున్న చర్చలు ఇప్పుడిప్పుడే కాస్త సర్దుమనుగుతున్న నేపధ్యంలో… తాజాగా జరిగిన చర్చలో పాల్గొన్న హీరో శివాజీ తెలుగుదేశం పార్టీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.

మునుపటితో పోలిస్తే… ప్రస్తుతం తాను చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నానని చెప్పిన శివాజీ… ప్రస్తుత హీరోలు కూడా సమాజానికి ఎంతోకొంత సేవ చేస్తున్నారని, దాదాపుగా ప్రతి హీరో కూడా సొంత ట్రస్ట్ లు ఏర్పాటు చేసుకుని ఏదొక విధంగా సహాయ పడుతున్నారని చెప్పగా, దీనికి టిడిపి నేత రాజేంద్రప్రసాద్ కౌంటర్ ఇచ్చారు.

కేవలం ‘ఇంకం టాక్స్’ ఎగ్గొట్టేందుకు కొందరు హీరోలు ట్రస్ట్ లు ఏర్పాటు చేసిన మాట వాస్తవమే అని అనడంతో… నాడు ఎన్టీఆర్ కూడా ఈ కారణాలతోనే ఏర్పాటు చేసారా? అంటూ సెటైర్ వేసారు. దీంతోనంది అవార్డుల చర్చావేదిక మరింత వేడిపుట్టి, రాజేంద్రప్రసాద్ – శివాజీల మధ్య మాటల యుద్ధం జరిగింది.

‘నువ్వంటే నువ్వు’ అనుకునే వరకు వెళ్ళిన ఈ సంఘటనలో… ఎన్టీఆర్ పెట్టింది ట్రస్ట్ కాదు, పార్టీ అంటూ సమర్ధించే ప్రయత్నం చేయగా, “ఎన్టీఆర్ ట్రస్ట్” పేరుతో చాలా పెద్దది ఉంది అంటూ బాబూ రాజేంద్రప్రసాద్ కు ట్రస్ట్ ను గుర్తు చేసే ప్రయత్నం చేసారు హీరో శివాజీ. దీంతో సదరు మీడియా ప్రతినిధి వీరిద్దరిని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు.

హీరోలు పన్నులు ఎగ్గొట్టడం కోసమే హీరోలు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారని బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సరికావంటూ శివాజీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అన్న తర్వాతే నాడు ఎన్టీఆర్ కూడా ఇదే పని చేసారా? అని తాను అనాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తానికి నంది అవార్డుల చర్చావేదిక ప్రతి రోజూ హాట్ టాపిక్ అవుతోంది.