తనయుడు కేటీఆర్ ను రాజకీయ వారసుడిగా ప్రకటించే క్రమంలో మేనల్లుడు హరీష్ రావును అడ్డు తొలగించే పనిలో ఉన్నారా కేసీఆర్ అంటే అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే ఎన్నికలలో హరీష్ రావును అసెంబ్లీకు కాకుండా పార్లమెంట్ కు పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహమట.
మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, కడియం శ్రీహరిని ఈసారి పార్లమెంట్కు పోటీ చేయిస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తెరాస కేసీఆర్ నాయకత్వంలోనే వెళ్లినా, ఒకవేళ భారీ మెజారిటీతో గెలిస్తే వెంటనే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇప్పటికే కేటీఆర్ కేసీఆర్ క్యాబినెట్ లో అతిముఖ్యమైన మంత్రిగా ఉన్నారు. ఆయన కింద ఐదు ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. కేసీఆర్ క్యాబినెట్ లో అత్యధిక శాఖలు ఉన్నవి ఆయనకే. ఇప్పటికే కేసీఆర్ ఎక్కువగా తెరవెనుక ఉంటూ తనయుడిని విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు.