హుజురాబాద్ ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఒకప్పటి సహచరుడు ఈటలను ఎలాగైనా ఓడించి ఆయన రాజకీయ చరిత్రకు ముగింపు పలకాలని కృత నిశ్చయంతో ఉన్నారు కేసీఆర్. హుజురాబాద్ లో గణనీయ స్థాయిలో ఉన్న దళితులను మచ్చిక చేసుకోవడానికి దళిత బంధు పథకాన్ని కూడా తీసుకుని వచ్చారు.
ఇక పోతే హుజురాబాద్ లో పార్టీని గెలిపించే బాధ్యత హరీష్ రావుకి అప్పగించారు. హరీష్ నియోజకవర్గంలో పని కూడా మొదలుపెట్టారు.హుజురాబాద్ లో ఒక సభలో హరీష్ మాట్లాడుతూ… ఈటల తల్లి లాంటి పార్టీని మోసం చేశారని, తల్లి గుండెల మీద తన్నిన ఘనత ఆయనదేనని చెప్పుకొచ్చారు.
అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి మీరు టీడీపీకి చేసింది ఏంటో? అసలు ఇప్పుడు తెరాసలో ఉన్న వారిలో అసలు పార్టీ వారు ఎంత మంది? ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మంత్రులు, ముఖ్యమైన పదవులలో ఉన్న వారంతా వారే కదా?
కేసీఆర్ ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ పెట్టారు కాబట్టి సరే 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఎంత మంది నేతలను టీడీపీ నుండి తీసుకున్నారు. హరీష్ రావు చెప్పిన లాజిక్ ప్రకారం … టీడీపీ, కాంగ్రెస్ నుండి నేతలను తెచ్చి పదవులు ఇవ్వడం అంటే తల్లి నుండి బిడ్డలను వేరు చేసినట్టు కదా?
అలా వేరే పార్టీ వారికి పదవులు ఇవ్వడం అంటే సొంత బిడ్డలను వదిలేసి పక్క వారి మీద ప్రేమ చూపించడం కాదా? తమ తల్లికి ద్రోహం జరిగింది అంటున్నారు హరీష్… మరి పక్క తల్లుల బాధ సంగతి ఏంటి? అసలు ఈటలను ఒక పథకం ప్రకారం పార్టీ నుండి వెళ్లగొట్టింది ఎవరు? మీ అమ్మకు ఒక రూల్.. వాళ్ళ అమ్మకి ఒక రూల్ ఎలా హరీష్ రావు గారు? అంటూ సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవా చేస్తున్నారు.