తెలంగాణకు వరప్రదాయినిగా చెప్పబడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్తో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు వైఎస్ జగన్, ఫడణవీస్, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే పనిలో ఉండగా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మాత్రం అక్కడకు రాకపోవడం విశేషం.
మేడికొండ వెళ్లకుండా సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రంగనాయకసాగర్ రిజర్వాయర్ సమీపంలోని రంగనాయకుల గుట్టపై జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన హరీష్.. కార్యకర్తలు, నేతలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఉదయం యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ప్రొఫెసర్ జైశంకర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళి అర్పించారు.
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హరీష్ రావుకు అసలు ఆహ్వానం అందలేదా అనేది అందరిలో ఉన్న ప్రశ్న. మంత్రిగా హరీష్ రావు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక కూలీలా పని చేశారు. మూడేళ్ళలోనే ప్రారంభోత్సవానికి చేరుకుందంటే అందులో హరీష్ పాత్ర చాలా కీలకం. అటువంటి హరీష్ ను పక్కన పెట్టడం శోచనీయం. అదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన జగన్ తో శిలాఫలకం ఆవిష్కరింపజేశారని హరీష్ అభిమానులు వాపోతున్నారు.