సినీ సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి, ఆపై హీరోగా మారిన జీవీ ప్రకాష్ కుమార్, ‘కడవుల్ ఇరుక్కన్ కుమార’ పేరిట నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. ఈ సినిమాకు సంబంధించిన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పాండిచ్చేరీలో జరిగిన ఈ ఘటనలో పెను ప్రమాదం నుండి బయటపడ్డ జీవీ ప్రకాష్ స్వల్పగాయాలతో తప్పించుకున్నారని సమాచారం.
ప్రకాష్, బాలాజీలపై దర్శకుడు రాజేష్ ఓ పోరాటాన్ని చిత్రీకరిస్తుండగా యాక్సిడెంట్ జరిగిందని సినిమా యూనిట్ వెల్లడించింది. కాగా, ఈ చిత్రంలో అవికాగోర్, నిక్కీ గార్లనీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన వాడే అయినా, ఇటీవల విడుదలైన “త్రిష లేదా నయనతార” చిత్రంతో తెలుగునాట కూడా జీవీ ప్రకాష్ ముఖం ప్రేక్షకులను పరిచయమైంది. అలాగే తాజాగా ‘నాకు ఇంకో పేరుంది’ పేరిట డబ్ చేసుకున్న మరో తమిళ సినిమా తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది.