gunturodu-trailer-talkమంచు మనోజ్ హీరోగా, ‘కంచె’ ఫేం ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న “గుంటూరోడు” ధియేటిరికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన టీజర్, ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ముద్ర వేసింది గానీ, ధియేటిరికల్ ట్రైలర్ తో ఈ సినిమా వినోదం పాలు ఎక్కువన్న విషయం స్పష్టమైంది. యాక్షన్ సన్నివేశాలు ఉన్నా గానీ, ఎంటర్టైన్మెంట్ ప్రధాన అంశంగా సినిమా రూపుదిద్దుకుందని తేటతెల్లమైంది.

మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మంచు మనోజ్ కు, సరైన సినిమా తగిలినట్లుగా “గుంటూరోడు” ట్రైలర్ సంకేతాలు ఇస్తోంది. ముఖ్యంగా శ్రీ వసంత్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ట్రైలర్ లోని హైలైట్స్ లో ప్రధాన అంశం. సన్నివేశాలలో హీరోయిజం ఉట్టిపడేలా వసంత్ మ్యూజిక్ ఉండగా, తనదైన డైలాగ్ డెలివరీతో, మనోజ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. అలాగే ‘కంచె’ తర్వాత మళ్ళీ కనపడని ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

రొటీన్ కధలా కనపడుతున్నా… కమర్షియల్ కోణంలో ఈ సినిమా సక్సెస్ ను అందుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అందులోనూ ప్రస్తుతం ఉన్న పెద్ద సినిమాల హడావుడి ముగిసిన తర్వాత ఫిబ్రవరిలో విడుదలకు ముహూర్తం పెట్టుకోవడంతో “గుంటూరోడు” ద్వారా సత్తా చాటడానికి మంచు మనోజ్ సిద్ధమైనట్లే కనపడుతున్నాడు. రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, సంపత్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ వంటి ప్రముఖ నటులతో వెండితెర నిండుగా కనపడుతోంది.