తాడికొండ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రిజర్వుడ్ కేటగిరిలోని ఎస్సి వర్గానికి చెందుతారా?లేదా అన్నదానిపై విచారణ జరగనుంది. రాష్ట్రపతి కార్యాలయానికి ఈ విషయమై ఫిర్యాదు వెళ్లగా ఆయన ఎన్నికల కమిషన్ కు పంపించారు. అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వచ్చింది.
ఆయన దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ ని కోరారు. ఒక ఇంటర్వ్యూలో తాను దళిత క్రిస్టియన్ ను అని శ్రీదేవి అన్నారని. దళితులు మతం మారితే వారి రిజర్వేషన్ కూడా కోల్పోతారు. ఈ క్రమంలో శ్రీదేవి ఎస్సి వర్గానికి చెందారని ఒక వ్యక్తి రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించారు.
ఈ నేపథ్యంలో శ్రీదేవి ఈనెల 26న మధ్యాహ్నం 3గంటలకు విచారణకు రావాలని జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు. ఎస్సీగా రుజువు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు తీసుకురావాలని అధికారి కోరారు. ఒకవేళ ఆమె అందులో విఫలమైతే ఆమెను అనర్హురాలిగా ప్రకటించే అవకాశం ఉంది.
ఆ క్రమంలో తాడికొండకు ఉపఎన్నికలు రావొచ్చు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆమెకు కోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా ఉంటుంది. దళితులు మతం మారినా తమ రికార్డులలో మాత్రం హిందువులం అంటూ రిజర్వేషన్లు పొందడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో ఈ కేసు జాతీయ మీడియాను సైతం ఆకర్షిస్తుంది.